లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీకి చేరుకున్న సందర్భంగా టిడిపి నాయకుల అభిమానం కట్టలు తెంచుకుంది. మంగళవారం యాన విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి ఆయనకు అనుమతి కూడా లభించింది. విశాఖ వెళ్లి గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను ఆయన కలిసేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. కానీ అర్ధరాత్రి విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది. దీంతో ఆయన రోడ్డు మార్గంలోనే అమరావతికి బయల్దేరి వెళ్లారు. అయితే ఆయన దారిపొడవునా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అధికార పార్టీ వైసీపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి చంద్రబాబు వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పార్టీ కార్యకర్తలు సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చంద్రబాబుకు స్వాగతం పలికారని వైసీపీ విమర్శించింది. ఫోటోలకు ఫోజులిస్తూ చంద్రబాబు బాధ్యతారాహిత్యాన్ని చాటుకున్నారని వైసీపీ ట్వీట్ చేసింది.