లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జరిగిన పశువుల దాణా కుంభకోణం 1996లో వెలుగులోకి వచ్చింది. కరువు సమయంలో పశువుల దాణా కోసం వెచ్చించాల్సిన డబ్బులో 9 వందల కోట్ల రూపాయలను వివిధ ట్రెజరీల నుంచి అక్రమంగా డ్రా చేశారని లాలూ ప్రసాద్తో పాటు పలువురు నేతలు, ప్రభుత్వాధికారులపై ఫిర్యాదులు అందాయి. వాటిపై సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ లాలూ సహా మిగతా నిందితులపై 5 కేసులు నమోదుచేసింది.
1994-96 మధ్యకాలంలో ప్రస్తుతం జార్ఖండ్లో ఉన్న దేవ్గఢ్ ట్రెజరీ నుంచి పశవుల దాణా కొనుగోలు కోసం లాలూ మరికొందరితో కలిసి 89.27 లక్షల రూపాయల డబ్బు అక్రమంగా డ్రా చేసినట్లు సీబీఐ గుర్తించింది. 1997 అక్టోబర్ 27న కేసుకు సంబంధించి చార్జ్షీట్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ.. లాలూప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా 34మంది పేర్లు అందులో చేర్చింది. కేసు విచారణ దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. ఈ వ్యవధిలో నిందితుల్లో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. 11 మంది చనిపోయారు. దీంతో మిగిలిన 23 మందిపై విచారణ కొనసాగించిన రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండు దశాబ్దాల అనంతరం వారికి శిక్షలు ఖరారుచేసింది.
దాణా స్కాం కేసుకు సంబంధించి తనపై నమోదుచేసిన కేసులను విడివిడిగా విచారించడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టును లాలూ ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం 2014లో కేసు విచారణపై స్టే విధించింది. అయితే జార్ఖండ్ హైకోర్టు నిర్ణయంపై సీబీఐ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దాణా స్కాంలో నమోదైన 5 కేసుల్లో అభియోగాలపై లాలూ విడివిడిగా వివరణ ఇవ్వాల్సిందేనన్న సీబీఐ వాదనను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. 2017 మేలో మిగిలిన నాలుగు కేసులను విడివిడిగా విచారించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం తీర్పు మేరకు కేసు విచారణ ముమ్మరం చేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డిసెంబర్ 23న లాలూతో పాటు 16మందిని దోషులుగా తేల్చింది. ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్కు మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు 5లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.