చైనాలో మొదలైన కరోనా మహమ్మారి రోజురోజుకీ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలను నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోంది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా (కొవిడ్-19) వైరస్ బారి నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కరోనా కేసులు నమోదు కాగా దాదాపు 70 వేల మంది మృత్యువాతపడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించడమే కాకుండా అమెరికా, యూరోపియన్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లో దీని తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడని దేశాలు ఉన్నాయి. ఫసిఫిక్ తీరంలోని చిన్న ఐలాండ్ దేశాలైన సాల్మన్ ఐలాండ్, వనౌతు, సమోవా, కిరిబాతి, మైక్రోనేషియా, టోంగా, ది మార్షల్ ఐలాండ్ పలవౌ, టువాలు, నౌరు వంటి దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి కారణం ఆ దేశాలు దూర ప్రాంతాల్లో ఉండటమే కాకుండా ప్రయాణాలపై ఉన్న పరిమితుల వల్ల ఇప్పటి వరకు ఆయా దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇక ఆసియా దేశాలైన ఉత్తర కొరియా, యెమెన్, తుర్క్మెనిస్థాన్, తజకిస్థాన్లలో కూడా ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఆయా దేశాలు ప్రకటించాయి. అయితే అంతర్జాతీయ నిపుణలు మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా పొరుగు దేశమైన చైనాలో తొలుత ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చైనా నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాపించే తరుణంలో ఈ వైరస్ ఆ దేశంలో దాదాపు 80 వేల మందికి సోకింది. అలానే 3 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో 3 లక్షల మందికి ఈ వైరస్ సోకగా 9 వేల మంది మరణించారు. అలానే 17 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు.