ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 08:33 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీల మధ్య నేతల గోడదూకుళ్లు సర్వసాధారణైపోయాయి. అయితే తరుచుగా పార్టీలు మారే నేతలు కొందరైతే.. తరాలు మారినా పార్టీలు మారని నేతలు మరికొందరు. కానీ ఈసారి ఆ సీన్ మారుతోంది. 40 ఏళ్ల రాజకీయ బంధాన్ని, సోదరుడితో అనుబంధాన్ని తెంచుకుని పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ఓ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఆయనే .. యనమల కృష్ణుడు. ఎన్నికల వేళ టీడీపీకి షాక్ ఇస్తూ.. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. మరోవైపు వైఎస్ జగన్ సమక్షంలో యనమల కృష్ణుడు వైసీపీలో చేరనున్నారు. శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.


మరోవైపు 42 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశానన్న యనమల కృష్ణుడు.. పార్టీ మారడం బాధగా ఉందని చెప్పారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తుని అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మోసపూరిత రాజకీయాలను వదలక తప్పలేదని.. తనను దూరం పెట్టాలని కొందరు దురుద్దేశంతో పని చేశారని యనమల కృష్ణుడు ఆరోపించారు.


అయితే అన్నాదమ్ముళ్ల మధ్య విభేదాలే యనమల కృష్ణుడు పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది. తుని అసెంబ్లీ స్థానం నుంచి యనమల రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడంలో తమ్ముడు యనమల కృష్ణుడు చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో తుని అసెంబ్లీ నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన కృష్ణుడు.. ఓటమి పాలయ్యారు, ఇక 2024 ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. అయితే టీడీపీ అధిష్టానం ఆయనకు షాక్ ఇచ్చింది. ఈసారి టికెట్‌ను యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్యకు కేటాయించింది. దీంతో యనమల కృష్ణుడు అసంతృప్తి గురయ్యారు. దీనికి తోడు యనమల దివ్య ప్రచారం సందర్భంగా తనను కలుపుకుని పోవటం లేదనే అసంతృప్తితో ఆయన ఉన్నట్లు సమాచారం.


ఈ క్రమంలోనే టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా చేసినట్లు సమాచారం. మరోవైపు యనమల కృష్ణుడు చేరికకు స్థానిక వైసీపీ నేత దాడిశెట్టి రాజా సైతం ఇప్పటికే అంగీకారం తెలియజేశారు. దీంతో శనివారం వైఎస్ జగన్‌ను కలవనున్న యనమల కృష్ణుడు.. వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com