ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరి హస్తగతం కానుందనే విషయం ఎవరికి అంతగా అంతుపట్టకుండా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు.. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల... అంటే తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆంధ్రా రాజకీయ నాయకులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.. చేస్తున్నారు.అందులోభాగంగా హైదరాబాద్ నగరంలోని ఆంధ్ర ఓటర్లతో.. కూకట్పల్లి, హైటెక్సిటీ, చందానగర్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో.. అదీ కూడా సెలవు దినాల్లో మరి ముఖ్యంగా శని, ఆదివారాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్ర భవిష్యత్తు, భవిష్యత్తు తరాల భవిష్యత్తుతోపాటు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవాలని సదరు రాజకీయ పార్టీల నాయకులు... హైదరాబాద్లోని ఆంధ్ర ఓటర్లకు విజ్జప్తి చేస్తున్నారు. మరి ముఖ్యంగా చిరు ఉద్యోగులపై ఆ యా పార్టీల నేతలు ప్రధానంగా దృష్టి సారించారు.పలు అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డులు, ఇళ్లలో పని చేసుకునే వారు.. విధిగా సొంత ఊర్లకు వచ్చి ఓటు వేయాలని సదరు నాయకులు సూచిస్తున్నారు. పోలింగ్కు ఒకటి లేదా రెండు రోజుల ముందే సొంత ఊర్లకు హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు వాహన సౌకర్యం కల్పిస్తామంటూ వారికి భరోసా సైతం కల్పిస్తున్నారు. మరికొందరు తాము సొంతంగా వస్తామని చెబుతుంటే.. వారికి తగిన మొత్తంలో నగదు కూడా అందజేస్తుండడం గమనార్హం.ఈ సమావేశం అనంతరం పసందైన విందు భోజనం ఏర్పాటు చేసి ఆంధ్రఓటర్లకు ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు రెండు రోజుల ముందే తాము స్వస్థలాలకు వెళ్తామని.. ఇప్పటికే వాచ్మెన్లు, పని వారు.. తమ తమ యజమానులను కోరుతున్నారు.