మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు, శిక్షలు తీసుకోవాల్సిందే అని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మహిళ భద్రతపై జరిగిన చర్చలో బాబు మాట్లాడుతూ .. ప్రతి రోజూ ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని వీటికి అడ్డుకట్ట వేయాలంటే చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయన అన్నారు. హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన తనను ఎంతో బాధించిందని చంద్రబాబు నాయుడు అన్నారు.
మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా.. మహిళల రక్షణ, భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చంద్రబాబు అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావడం చాలా సంతోషమన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నిందితులు ఎంతటివారైనా శిక్షించే విధంగా చట్టాలు రావాలని వ్యాఖ్యానించారు.