ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడితే వారికి 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా చట్టం తెస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన బిల్లును డిసెంబర్ 11న అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ఇక నుంచి ఎవరైనా తప్పు చేయాలంటే భయపడేలా చట్టం తెస్తామన్నారు.
ఘటన జరిగిన వారం రోజుల్లోనే విచారణ పూర్తి చేసి, మరో వారం రోజుల్లో అన్ని నివేదికలు సిద్దం చేసేలా ప్లాన్ ఉంటుందన్నారు. మొత్తం 15 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చట్టం తెచ్చేలా ప్లాన్ చేస్తామన్నారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే శిక్ష అమలయ్యేలా చట్టంలో పొందుపరుస్తామన్నారు. దీని ప్రకారం కేవలం 21 రోజుల్లోనే శిక్ష అమలు చేసే విధానం వస్తుందన్నారు. రెడ్ హ్యాండెడ్ గా కళ్లకు కనిపించే ఆధారాలు ఉంటే వారికి కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చట్టం తీసుకువస్తామని సభలో సీఎం జగన్ ప్రకటించారు. సోషల్ మీడియాలో మహిళల పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారి పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి కూడా నూతన చట్టంలో పొందుపరుస్తామని సీఎం జగన్ తెలిపారు.