దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే దిశ ఘటనను ఏడేళ్ల క్రితం దేశ రాజధానిలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతంతో పోల్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్కౌంటర్తో దిశ ఆత్మకు శాంతి చేకూరినట్లయిందని, త్వరలోనే నిర్భయకు న్యాయం జరగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ ఎన్కౌంటర్ నేపథ్యంలో దిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నీరజ్ గతంలో నిర్భయ అత్యాచారం, హత్య కేసును పర్యవేక్షించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై ఆయన స్పందిస్తూ.. 'నిర్భయ ఘటన సమయంలోనూ మాపై చాలా ఒత్తిడి వచ్చింది. కానీ నిందితులను చంపేయాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఆకలిగా ఉన్న సింహాలకు నిందితులను వదిలిపెట్టండి అంటూ మాకు చాలా సందేశాలు వచ్చాయి. కానీ మేం చట్టాన్ని అనుసరించాం' అని నీరజ్ కుమార్ తెలిపారు.