ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండె ధైర్యానికి వైసీపీ భయపడుతుంది: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2019, 07:18 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ వైసీపీ ని టార్గెట్ గా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. నిన్నటి రోజున కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా మరువకముందే తాజాగా రాయలసీమ పర్యటనలో మరొక ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీకి భయపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా జనసేన గుండె బలానికి వైసీపీ ప్రభుత్వం బెంబేలెత్తుతు భయపడి పోతుందని తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో అన్నారు. రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులు వచ్చినా , ఆ ప్రాంతం వెనుకబడి ఉందని ఆయన అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రతిపనికి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వెళుతోందని అన్నారు. రాయలసీమలో రైతులకు శీతల గిడ్డంగులు కట్టలేకపోయారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.


తాను రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్ పరిశ్రమలు పెట్టుకునేందుకు కాదన్నారు. ఇక్కడ నేతలకు పచ్చటి పొలాలు ఉన్నాయని.. పేదలు మాత్రం పొట్టచేత పట్టుకుని వలసలు వెళ్తున్నారని చెప్పారు. ఏడుకొండలకు తప్ప ప్రతిదానికీ వైకాపా రంగులు వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంకా అనేక విమర్శలు వైసీపీ ప్రభుత్వం పై మరియు వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల పై పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది.


మొత్తంమీద చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో వైసీపీ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతం నుండి వైసిపి పార్టీ నాయకులపై మరి ముఖ్యమంత్రి జగన్ పై గట్టిగా టార్గెట్ చేసుకుని రాజకీయ పర్యటనను చేపట్టడంతో...పవన్ పర్యటన పై చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇది కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాయలసీమ రౌడీలు ఇక్కడికి వస్తే తన్ని తరిమేస్తాం అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో వెళ్లి పౌరుషానికి అలాగే సంస్కృతికి ఇంకా అనేక విషయాలకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్ అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాల్లో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని మరోపక్క వైసీపీ పార్టీ నేతలు కామెంట్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com