గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీపై చేసిన విమర్శలకు నారా లోకేశ్ స్పందించారు. నెల్లూరులో టీడీపీ కార్యకర్త కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్... అనంతరం మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీకి ఏ మాత్రం సిగ్గున్నా... వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కేసులకు భయపడి ఒకరు, ఆస్తుల భయంతో మరొకరు పార్టీ మారారని వంశీ, అవినాష్లను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం పార్టీ కార్యకర్తలపై వేధింపుల అన్న వ్యక్తి... ఇప్పుడు పార్టీ, పార్టీ అధినేతపై విమర్శలు చేయడం ఏంటని లోకేశ్ ప్రశ్నించారు.
వంశీ జే టర్న్ తీసుకున్నారని లోకేశ్ విమర్శించారు. ఒకరిద్దరు నేతలు పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తాము వ్యతిరేకించడం లేదని... కేవలం తెలుగు మీడియం ఆప్షన్ను కొనసాగించాలని కోరామని లోకేశ్ అన్నారు. తాను ఇంగ్లీష్ మీడియంలోనే చదివానన్న లోకేశ్... సీఎం జగన్ పేపర్ లీకేజీలో దొరికారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి తనపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు.