ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెలుగు యానిమేటర్స్ వేతనాలు పెంచినందుకు కృతజ్ఞతాభావం గా బుధవారం తునిలో రామ థియేటర్ సెంటర్ లో గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గొల్ల అప్పారావు సెంటర్ నుంచి వందలాది మంది యానిమేటర్స్ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు మోతుకూరు వెంకటేష్ , ఏలూరి బాలు రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు ఎం. వెంకటేష్ ,ఏలూరి బాలు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు.
పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నవరత్నాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. చిరుద్యోగులు అందరకు కనీస వేతనాలు అందించాలన్న లక్ష్యంతో నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేతనాలు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేలంగి రమణ గౌడ్, పోతల రమణ , పోతుల లక్ష్మణ్, ఎస్.కె. క్వాజా, చోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, తుని, తొండంగి, కోటనందూరు మండలానికి చెందిన వెలుగు యానిమేటర్స్ పాల్గొన్నారు.