టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుపై కన్నేశాడు. బంగ్లాదేశ్తో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో అత్యధికసార్లు బ్యాట్స్మెన్ను ఔట్ చేసిన భారత్ వికెట్ కీపర్గా ధోనీని అధిగమించేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్తో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోని(3 టెస్టుల్లో 15 అవుట్లు)తో అగ్రస్థానంలో ఉండగా... వృద్ధిమాన్ సాహా(2 టెస్టుల్లో 7 అవుట్లు)తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక, దినేశ్ కార్తీక్(12 అవుట్లు)తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి ధోని ఇప్పటికే రిైటర్ కాగా... దినేశ్ కార్తీక్కు బంగ్లా పర్యటనలో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు విషయానికి వస్తే ముష్పికర్ రహీమ్(11 అవుట్లు)తో అగ్రస్థానంలో ఉండగా... బంగ్లా మాజీ వికెట్ కీపర్ ఖలీద్ మసూద్(4 అవుట్లు)తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ధోని రికార్డుని అధిగమించేందుకు ముష్ఫికర్కే ఎక్కువ అవకాశం ఉంది. 2009-10లో భారత్-బంగ్లాదేశ్ల మధ్య జరిగిన ఏకైక టెస్టులో ధోని 8 మందిని పెవిలియన్కు చేర్చాడు. ఈ నేపథ్యంలో ఒక టెస్టులో అత్యధిక మందిని ఔట్ చేసిన రికార్డుని ధోని పేరిట ఉంది. ఇక, సాహా విషయానికి వస్తే 2016-17లో జరిగిన ఒక టెస్టులో నలుగురిని పెవలియన్కు చేర్చాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ముగియడంతో ఇరు జట్లు రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్పై దృష్టి సారించాయి. ఇరు జట్ల మధ్య ఇండోర్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ కోసం బుధవారం నుంచే టీమిండియా ప్రాక్టీస్ ఆరంభించింది. అయితే, టీమిండియా ఆటగాళ్ల ఆలోచనంతా కోల్కతాలో జరిగే తొలి డే/నైట్ మ్యాచ్పైనే ఉంది. తొలిసారి డే/నైట్ టెస్ట్ ఆడనున్న భారత జట్టు కూడా పింక్ బాల్ ప్రాక్టీస్పైనే ఎక్కువ దృష్టిసారించారు. మంగళవారం చేసిన సన్నాహకాల్లో ఎర్రబంతితో పాటు గులాబీ బంతులతోనూ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశారు.