అయోధ్య రామజన్మ భూమి- బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే దేశంలో ఆర్థిక మందగమనం ఏర్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ భావించిన విషయం తెలిసిందే. కాగా.. ర్యాలీ నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ పేర్కొంది.