రైతులకి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతుల విత్తనోత్పత్తికి ప్రోత్సాహం అందిస్తామని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఏపీ సీడ్స్ రైతులతో ఎంవోయూ చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఇక...రాష్ట్రంలోని అన్ని పంటలను ఈ-క్రాప్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు మంత్రి. దీని కోసం గ్రామ స్థాయిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కు టాబ్ లు అందిస్తామని అన్నారు. ఉచిత పంట బీమాలో ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు మంత్రి కన్నబాబు. రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలని జగన్ ఆదేశించినట్టు కన్నబాబు పేర్కోన్నారు.
ఈరోజు వ్యవసాయశాఖపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం, వ్యవసాయం, విత్తనాల పంపిణీ వంటిఅంశాలపై చర్చించారు. రబీ సీజన్లో పంటల పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జలాశయాల్లో సాగునీటిని పంటల సాగుకు వినియోగించాలని సూచించారు. భూసార పరీక్షా పరికరాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల షాపులు ఏర్పాటు చేస్తున్నామని దానికి సంబంధించిన చర్యలు మొదలుపెట్టడం జరిగిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. చిరు ధాన్యాలు సాగు చేసే వారికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.