ముంబయి: కొన్ని నెలల క్రితం కరువుతో కటకటలాడిన మహారాష్ట్ర ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అతాలకుతలం అవుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర పశ్చిమ జిల్లాలు. వరదల కారణంగా వివిధ ప్రాంతాల్లోని 1.32 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా సాంగ్లీ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పడవ బోల్తాపడి 14 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన మహా జన్ ఆదేశ్ యాత్రను రద్దు చేసుకుని వరద ప్రభావంపై సహచర మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గడిచిన 7 రోజుల్లో మహారాష్ట్ర పశ్చిమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 16 మంది మృతిచెందినట్లుగా సమాచారం. వరదల కారణంగా సాంగ్లీ జిల్లాలో 51 వేల మంది, కోల్హాపూర్ జిల్లాలో 51 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా రూ.10 వేలు, రూ. 15 వేలను అందించనున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు.