మహారాష్ట్రలోని ముంబయిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. దీనికితోడు రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను బీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ముంబయిలో వరదల తీవ్రతకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ వర్షానికి వరదనీరు బీఎంసీ బస్సులోకి వచ్చేశాయి. దీంతో పలువురు ప్రయాణికులు బస్సులోని వెనుక భాగానికి వచ్చేయగా, కొందరు మాత్రం బస్సు ముందు భాగంలోనే కూర్చున్నారు.