కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న భూమా ఫ్యామిలీలో ఇప్పుడు చిచ్చు రగిలా ఉంది. వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి వెళ్లి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియ రాజకీయంగా తన పట్టు నిలుపుకుంటున్నా, తాజా ఎన్నికలలో అనూహ్యంగా ఓటమి చవి చూసారు. అయితే తాజాగా ఆమె పార్టీ మారుతారంటూ కథనాలు వచ్చినా వైసిపిలో చేరితే అంగీకరించబోమని ఆ పార్టీ శ్రేణులు హెచ్చరించడంతో జగన్ కూడా అటువైపు చూడటం మానేసారు. దీంతో ఆమె తెలుగుదేశంలోనే కొనసాగాల్సి వస్తోంది.
కాగా భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు, భూమా అఖిలప్రియకు సోదరుడైన భూమా కిషోర్ రెడ్డి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమవుతున్నాడు. అది కూడా కమలం పార్టీలో చేరి మరీ. దీంతో ఇన్నాళ్లు రాజకీయంగా పరస్పర అండదండలు అందుకుంటున్న భూమా ఫ్యామిలీ ఇప్పుడు నిట్టనిలువునా చీలినట్టే కనిపిస్తోంది. భూమా ఫ్యామిలీలోని ప్రముఖులంతా అతడి వెంట ఉండడం అఖిలప్రియకు షాక్ గానే చెప్పాలి.