బిజెపి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోక్ సభఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 303 మంది సభ్యులు, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు ఓటు వేశారు. కాగా, గత నెలలోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినా విపక్షాల వ్యతిరేకతతో చర్చ జరగలేదు. ఈక్రమంలో లోక్ సభలో ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో ఈరోజు చర్చ జరిగింది. ఈ బిల్లును నిరసిస్తూ కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ ఎంపీలు వాకౌట్ చేయగా.. ఈ బిల్లును వైఎస్సార్సీపీ కూడా వ్యతిరేకించింది. అనంతరం, ఈ బిల్లు ఆమోదానికి ఓటింగ్ నిర్వహించారు. తాజాగా లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది.