తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ గురువారం శ్రీచక్రత్తాళ్వార్ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర ఘనంగా జరుగనున్నాయి. శ్రీ ఆండాళ్ తిరువడిపురం ఉత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం నుంచి ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారిని, శ్రీప్రతివాది భయంకరన్ అన్నన్ ఉత్సవర్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని శ్రీకోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ తరువాత శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర చేపడతారు.
సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, శ్రీ చక్రత్తాళ్వార్ను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆండాళ్ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.