మ్యాజిక్ విన్యాసం వికటించింది. సాహసం ప్రాణాల మీదికి తెచ్చింది. అంతా చూస్తుండగానే ఆ జాదూగర్(ఇంద్రజాలికుడు) గంగా నది నీటిలో మునిగిపోయాడు. అతడి కోసం గజ ఈతగాళ్లు నదిని జల్లెడ పడుతున్నారు. కోల్కతాలోని హౌరాబ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. జాదూగర్ మంద్రాకేగా ప్రసిద్ధి పొంది చంచల్ లాహిరి(40) చేసిన మ్యాజిక్ విన్యాసం వికటించింది. పోలీసులు, మీడియా, కుటుంబ సభ్యులు, వందలాదిమంది చూస్తుండగానే ఆయన నీటిలో అదృశ్యమయ్యారు. ఇప్పుడాయన కోసం పోలీసులు గంగానదిలో గాలిస్తున్నారు.
కాళ్లు, చేతులను తాళ్లతో బంధించిన లాహిరిని ఓ గ్లాస్ బాక్స్లో పెట్టి తాళం వేశారు. తర్వాత ఆ బాక్స్ ని నదిలో విడిచిపెట్టారు. లాహిరి ఆ సంకెళ్లు తెంచుకుని బాక్స్ నుంచి బయటకి రావాలి. ఇదీ విన్యాసం. ఈ స్టంట్ పేరు అండర్ వాటర్ స్టంట్. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అలా దిగిన లాహిరి ఎంతకూ బయటకు రాలేదు. దీంతో బయట ఉన్న వారంతా కంగారు పడ్డారు. ఏదో ప్రమాదం జరిగిందని గుర్తించారు. లాహిరి నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు ఆయన కోసం గాలించినా లాభం లేకపోయింది. ఆయన జాడ కానరాలేదు. గంగా నదిలో లైవ్ స్టంట్ చేయాలనుకున్న చంచల్ లాహిరి అడ్రస్ లేకుండా పోయారు.
21 ఏళ్ల క్రితం ఇదే ప్రదేశంలో ఇదే విన్యాసాన్ని విజయవంతంగా చేశానని విన్యాసం చేయడానికి ముందు లాహిరి చెప్పారు. అప్పట్లో 21 సెకన్లలోనే బయటకు వచ్చేశానని వివరించారు. ఈసారి బయటకు రావడం కష్టమేనని, వస్తే మ్యాజిక్ అవుతుందని, లేదంటే ట్రాజిక్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ మ్యాజిక్ కాస్తా విషాదంగా ముగిసింది.
కాళ్లు చేతులు తాళ్లతో బంధించుకుని గ్లాస్ బ్లాక్ లో నీళ్లలోకి దిగడం.. ఆ తర్వాత సంకెళ్లు తెంచుకుని బాక్స్ నుంచి బయటకు రావడం.. సాహసంతో కూడిన మ్యాజిక్. ఇలాంటి విన్యాసాలు చేయడంలో హ్యారీ హౌడి ప్రసిద్ధుడు. ఆయనను ఆదర్శంగా తీసుకున్న లాహిరి.. తాను కూడా రిస్క్ స్టంట్ చేయడానికి ట్రై చేసి ప్రమాదంలో పడ్డారు.
లాహిరి.. మిలియనిమ్ పార్క్ దగ్గర విన్యాసం చేశారు. హౌరా బ్రిడ్జి 28వ పిల్లర్ దగ్గర గల్లంతుయ్యారు. గత ఈతగాళ్లు నదిని జల్లెడ పడుతున్నారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉందని, లాహిరి నీటిలో కొట్టుకుని పోయింటాడని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యం కూడా కారణమే అని చెబుతున్నారు. ఎలాంటి సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోలేదని, అదే ప్రమాదానికి దారితీసిందని చెబుతున్నారు.