ఈ మధ్య ఏ ఏటీఎంకి వెళ్లినా 'నో క్యాష్' బోర్డు కనిపించడం పరిపాటిగా మారింది! ఉసూరు మంటూ మరో బ్యాంకు ఏటిఎంలో డబ్బులు తీసారో, బ్యాంకులు సర్వీస్ చార్జీల ముసుగులో వీర బాదుడు బాదేసేవి. అయితే తాజాగా నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగి ఉసూరుమనే ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. . నగదు లేని ఏటీఎంల గురించి పూర్తి సమాచారం ఉన్నా సకాలంలో నగదును నింపేందుకు బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో నగదు నింపకుండా ఏటీఎంలను ఖాళీగా ఉంచే బ్యాంకులు జరిమానా విధించనున్నట్టు ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టం చేయటం బ్యాంకు ఖాతా దారులకు కలసి వచ్చే అంశమే. దీంతో ఇకమీదట ఏటిఎంలు నిండు కుండలా ఉండే పరిస్థితి రావచ్చని జనం భావిస్తున్నారు.
మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉంచిన బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేస్తామని ఆర్బీఐ పేర్కొనటంతో గ్రామీణ ప్రాంత బ్యాంకుల వినియోగదారుల వెతలు తీరనున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను బట్టి , ప్రాంతాల వారీగా ఈ జరిమానా స్థాయి ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ ప్రకటనతో ఏటీఎంలు నిత్యం నగదుతో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.