డాక్టర్ల నిర్లక్ష్యంపై ఆరోపణలు సహజం. చాలామంది రోగులు ఓపిక పడతారు. జబ్బు తగ్గకపోతే మరో వైద్యుణ్ని చూసుకుంటారు. మరికొందరు రోగం తగ్గకపోతే డాక్టరును రెండు మాటలు అంటారు. మరీ కొపమొస్తే ఓ దెబ్బ వేస్తారు. అంతేగాని హత్యల దాకా పోరు. కానీ ఓ దురద రోగి బరితెగించాడు. తనకు చికిత్స చేస్తున్న డాక్టర్పై కోపంతో అతని భార్యాబిడ్డలను కత్తితో పొడిచేశాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం జరిగిందీ దారుణం.
రఫిక్ రషీద్ అనే 45 ఏళ్ల ప్రబుద్ధుడు దురద వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరు నెలల కిందట రామకృష్ణ వర్మ అనే వైద్యుడి వద్దకు వెళ్లాడు. వర్మ అతనికి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా దురద మరింత ఎక్కువైంది. రషీద్ గురువారం ఆస్పత్రికి వచ్చాడు. అయితే వర్మ లేడు. తర్వాత రావాలని వర్మ భార్య లత చెప్పింది. రషీద్ ఆమెతో గొడవ పడ్డాడు. కోపం తట్టుకోలేక ఆమెను పిచ్చిగా పొడిచేశాడు. సాయంగా వచ్చిన ఆమె కొడుకు అభిషేక్నూ గాయపర్చి పారిపోయాడు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా లత చనిపోయింది. పోలీసులు రషీద్ను అరెస్ట్ చేశారు. అతడు నాలుగేళ్ల కిందట ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని, అతని వద్ద ఎప్పుడూ కత్తి ఉంటుందని పోలీసులు చెప్పారు.