ఏపీ ఎన్నికలు ముగియడంతో సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ చేశారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటాన్ని ఉదృతం చేశారు. దేవేగౌడ ఆహ్వానం మేరకు కర్ణాటక లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈవీఎంలపై ఇప్పటికే బీజేపీ యేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. నేటి నుంచి జాతీయ స్థాయి ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు.. ఏపీ ఎన్నికలు ముగియడంతో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకులు దేవేగౌడ ఆహ్వానం మేరకు మొదట కర్ణాటక లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కలిసి ఎన్నికల సభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. కేవలం ఇతర రాష్ట్రాల్లో ప్రచారమే కాకుండా.. మోదీ సర్కార్పై పోరాటానికి అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా విపక్షాలన్నింటినీ ఈవీఎంలపై యుద్ధానికి రెడీ చేశారు. చంద్రబాబు నేతృత్వంలో విపక్షాలన్నీ ఈసీ తీరుపై పోరాటంలో ముందుకు కదిలాయి. ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్ క్లబ్లో జరిగిన సమావేశంలో.. విపక్షాలన్ని ముక్తకంఠంతో ఈవీఎంలు కంటే బ్యాలెట్ బెస్ట్ అని నినదించాయి. వీవీ ప్యాట్ల్లో 50 శాతం లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశాయి విపక్షాలు. దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తామని తేల్చి చెప్పేశాయి. తొలిదశ పోలింగ్లోనే ఈసీ విశ్వసనీయత కొల్పోయిందని ఆరోపించిన పార్టీలు.. వీవీ ప్యాట్లో స్లిప్పులు 7 సెకన్లకు బదులు 3 సెకన్లే కనిపిస్తున్నాయని సాక్షాలతో సహా చూపించారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు ఎక్కువ సమయం పడుతుందన్న ఈసీ వాదనను తప్పు పట్టారు చంద్రబాబు. కేవలం మూడు గంటల్లో లెక్కించవచ్చని అన్నారు. 9 వేల కోట్ల ఖర్చు పెట్టి అమర్చిన వీవీ ప్యాట్లో ఒక్క బ్యాలెట్ యూనిట్ను లెక్కించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అగ్రదేశాలే ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల్లో సాంకేతిక దుర్వినియోగానికి చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారాయన.