ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2019, 04:21 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను టార్గెట్ చేస్తూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చెలరేగిపోయారు. చంద్రబాబుకు సంబంధించిన దొంగ ఫైళ్లన్నీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు లాకర్‌లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ రహస్యాలను వెంకటేశ్వరరావు ఎక్కడ బయటపెడతాడో అన్న భయంతో ఎన్నికల సంఘాన్ని కూడా బాబు ఎదిరించేందుకు సిద్దమయ్యాడని విమర్శించారు. నాలుగు రోజులుండే పోస్టుకు పట్టింపులు ఎందుకనీ, తెలిసినదంతా కక్కేసి వెంకటేశ్వరరావు పాపప్రక్షాళన చేసుకోవాలని విజయసాయి సూచించారు. అలాగే, టీడీపీ సభలకు హాజరవుతోన్న వారికి పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది డబ్బులు పంచుతున్నారని, ఈ వీడియోలు వైరల్‌గా మారాయంటూ మరో ట్వీట్‌లో దుమ్మెత్తిపోశారు.


‘చంద్రబాబు దొంగ వ్యవహారాల ఫైళ్లన్నీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్రావు లాకర్‌లో ఉన్నాయి. రహస్యాలన్నీ ఎక్కడ బయట పెడతాడో అని ఆయన కోసం ఎలక్షన్ కమిషన్‌ను కూడా ఎదిరించేందుకు సిద్ధమయ్యాడు చంద్రబాబు. 4 రోజులుండే పోస్టు కోసం పట్టింపులెందుకు? ABV తెలిసిందంతా కక్కేసి పాప ప్రక్షాళన చేసుకో’ అని ట్వీట్ చేశారు.


‘తెలుగుదేశం ఎన్నికల ప్రచారానికి హాజరైన వారికి పోలీసు కానిస్టేబుళ్లు, ఇంటెలిజెన్స్ సిబ్బంది డబ్బులు పంచుతున్న వీడియో వైరల్‌గా మారింది. కార్యకర్తల టీ షర్టులను బట్టి ఇది పలాసలో జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయాలను అధ:పాతాళానికి నెట్టేసిన నికృష్ఠుడిగా చరిత్రలో మిగిలి పోతావు చంద్రబాబూ’అంటూ ధ్వజమెత్తారు.వినుకొండ, పాయకరావుపేట, పార్వతీపురం, మండపేట, ముమ్మిడివరం ఇలా ఎక్కడికెళ్లినా జగన్‌గారి సభలకు పోటెత్తుతున్న జన సునామీని చూడు చంద్రబాబూ. అనుకూల మీడియా చూపించకున్నా సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. చలవ పందిళ్లలో కుర్చీలు వేసినా వందల మంది కూడా కనిపించట్లేదు నీ సోది వినడానికి’ అంటూ ఎద్దేవా చేశారు.


 


‘ఒక సినిమా రిలీజవుతుందంటే వణికిపోయి స్టేలు తెస్తాడు. ఒక పోలీసును పక్కకు తప్పిస్తే రాజ్యాంగ విరుద్ధంగా జీవోలిచ్చి అడ్డుకుంటాడు. ఎన్నికల్లో ముఖాముఖి పోరాడే ధైర్యం లేక తనకు తాళం వేసే పాల్, కోతల మాస్టర్ కళ్యాణ్‌లను కలుపుకున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి అవమానకర నిష్క్రమణ తప్పదు’ అంటూ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com