జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా దాడి ఘటనలో తన కుమారుడు అమరుడు అయ్యాడని, మరో కుమారుడిని కూడా సైన్యంలోకి పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒక జవాన్ తండ్రి తెలిపారు. గురువారం జరిగిన ఆత్మాహుతి ఘటనలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ దుర్ఘటనలో బీహార్లోని బగల్పురాకు చెందిన రతన్ ఠాకూర్ అనే జవాన్ అమరుడయ్యారు. ఈ ఘటనపై తీరని శోకసంద్రంలో ఉన్న రతన్ కుమార్ తండ్రి మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు ఎప్పటికీ సిద్దమేనన్నారు. పెద్దోడిని కోల్పోయాను, రెండో బిడ్డను కూడా పంపిస్తాను అన్నారు. దొంగదెబ్బ తీసిన పాక్ కు గట్టి బుద్ది చెప్పాల్సిందేనన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు జమ్ముకాశ్మీర్ పోలీసులు ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎన్ఐఏ బృందం కూడా కాశ్మీర్ చేరుకుని విచారణ ప్రారంభించింది.