అఖిల పక్ష సమావేశంలో పుల్వామ ఘటనపై సుదీర్ఘంగా చర్చించామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత ఏపీ.జితేందర్ రెడ్డి తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీఆర్పీఎఫ్ ఏడీజీ పుల్వామా ఘోర ఘటనను పార్టీల నేతలకు వివరించినట్లు చెప్పారు. మృతుల భౌతిక కాయాలు, ఘటన తరువాత అక్కడి పరిస్ధితుల చిత్రాలను ఏడీజీ మాకు చూపించారన్నారు. శరీర భాగాలు కూడా గుర్తు పట్టలేని పరిస్ధితిలో జావాన్ల మృత దేహాలు మారిపోయాయి.. ఆ దృశ్యాలు చూసి అన్ని పార్టీల నేతలు చలించిపోయారని జితేందర్ రెడ్డి తెలిపారు. ఉగ్రవాదులు ఇలాంటి ఘటనలతో భయాందోళన సృష్టించాలని చూస్తున్నారన్నారు. పుల్వామా ఘటనను ఖండిస్తూ అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదాన్ని వేరు నుంచి తొలగించాలని ముక్త కంఠంతో అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేశామన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా టెర్రరిజాన్ని రూపు మాపాల్సిన అవసరం ఉందన్నారు. పుల్వామ ఘటన లో సిఆర్పీఎఫ్ అధికారుల వైఫల్యం అనే అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు. సిఆర్పీఎఫ్ జావాన్ల కదలిక జమ్మూ కాశ్మీర్ లో ప్రతి 15, 20 రోజులకు ఒకసారి జరిగుతూనే ఉంటుందని.. సర్వీస్ రోడ్ వెంట తెల్లని వాహనంలో వచ్చిన ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకోవడం తో ఈ ఘటన జరిగిందని జితేందర్ రెడ్డి వివరించారు.