ఈ నెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రేస్ పార్టీ ప్రత్యేక భరోసా యాత్ర ప్రారంభించనుంది. పిసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సొంత జిల్లా అయిన అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. 19వ తేదీ ఉదయం 8 గంటలకు మడకశిర, 11 గంటలకు హిందూపూర్, 2 గంటలకు పెనుకొండ, సాయంత్రం 4 గంటలకు మామిళ్ళపల్లి మీదుగా 6 గంటలకు అనంతపురం చేరుకుని అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ భరోసా యాత్రలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీరామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు హాజరవుతారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా ఈ భరోసా యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని పెనుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కేటీ.శ్రీధర్ తెలిపారు. అయితే ఇంతవరకూ వారి పర్యటన తేదీలు ఖరారు కాలేదు.