తన నియోజకవర్గ ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారన్న వార్తలపై ఆయన తన వైఖరి చెప్పడానికి కప్పదాటు వైఖరిని అవలంభించారు. ఓ వైపు పార్టీ మారాల్సిన అవసరం లేదంటూనే, మరోవైపు తన చర్యలే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతాయన్నారు. అదే సమయంలో టీడీపీలో అసంతృప్తి లేదన్నారు. ‘ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది నియోజకవర్గ ప్రజల కోసమే. నా నియోజకవర్గమే నా ఎజెండా. ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ లేదు. అయితే, కోటిపల్లి -ముక్తేశ్వరం బ్రిడ్జి కట్టాలనేది నా చిరకాల కోరిక. కోనసీమ వాసుల కల కూడా అదే.’ అని తోట త్రిమూర్తులు తెలిపారు. ఆమంచి కృష్ణమోహన్ తర్వాత తోట త్రిమూర్తులు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన తోట త్రిమూర్తులు ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో స్వతంత్రంగా గెలిచిన తర్వాత టీడీపీలో చేరారన్నారు. అయితే, ఇప్పుడు మళ్లీ వెళ్లిపోయారని చెప్పారు.
‘మంత్రిపదవి ఆఫర్ చేస్తే వెళ్తారా?’ అన్న ప్రశ్నకు తోట త్రిమూర్తులు నర్మగర్భంగా స్పందించారు. ప్రజాబలం ఉన్న నాయకుల కోసం పార్టీలు ఎదురుచూస్తుంటాయన్నారు. నాలుగైదు నియోజకవర్గాలను ప్రభావితం చేయగల నాయకుల కోసం అన్నిపార్టీలు చూస్తుంటాయని, అలాంటి వారికి ఆఫర్లు వస్తూనే ఉంటాయన్నారు. దీన్ని బట్టి పరోక్షంగా తనకు ఆఫర్ ఉందన్న విషయాన్ని మాత్రం ఆయన అంగీకరించారు. తోట త్రిమూర్తులు ఈనెల 16న వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.