హైదరాబాద్లోని మియాపూర్ స్టేషన్ కింద పెద్ద ప్రమాదమే జరిగింది. శనివారం (అక్టోబర్ 19న) సాయంత్రం సమయంలో ఓ రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తం దగ్ధమైపోయింది. సరిగ్గా మియాపూర్ మెట్రో స్టేషన్ కిందకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. దీంతో.. అప్రమత్తమైన డ్రైవర్.. కారును పక్కనే ఆపేసి అందులో నుంచి బయటికొచ్చాడు. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది.
పటాన్ చెరువు నుంచి కూకట్పల్లికి వెళ్తోన్న కారు (వోక్స్ వ్యాగన్).. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే.. భారీ శబ్దంతో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో.. డ్రైవర్ వెంటనే కారు రోడ్డు పక్కన ఆపేసి అందులో నుంచి బయటికి వచ్చాడు. కిందికి దిగి ఏం జరిగిందో చూద్దామనేలోపే.. కళ్లముందే కారు మొత్తం మంటల్లో చిక్కుకుపోయి దగ్ధమైంది. అయితే.. కారు సరిగ్గా మెట్రో స్టేషన్ కింద.. మెట్ల దగ్గరే ఆపటంతో అక్కడున్న ప్రయాణికులు కొంత భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాప సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అయితే అప్పటికే కారు మొత్తం దగ్ధమైపోయింది. కాగా.. కారులో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు.
ముంబై, హైదరాబాద్ హైవేపై ఈ అగ్నిప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సరిగ్గా.. సాయంత్రం ఆఫీసులు, విద్యాసంస్థలు మూసేసే సమయం కావటం.. రద్దీ ఎక్కువగా ఉండటం.. అదే సమయంలో ఈ ప్రమాదం జరగటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం (అక్టోబర్ 18న) రోజున.. మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచారిస్తోందన్న వార్త స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. చిరుత సంచరిస్తోందంటూ.. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావటంతో.. హైదరాబాద్లో చిరుతేంటని అందరూ ఆందోళనతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో.. సంబంధిత అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. అంతా పరీశీలించగా.. చివరికి అది చిరుత కాదు అడవి పిల్లి అని అధికారులు తేల్చారు.