ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి.. పొదల్లోకి తీసుకెళ్లి

national |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 11:05 PM

వైఎస్ఆర్ జిల్లా బద్వేలు ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బద్వేలు పట్టణానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినిపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఉంటున్న కాలనీలోనే విఘ్నేష్ అనే యువకుడు కూడా ఉంటున్నాడు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తున్నాడు. బాలిక 8వ తరగతి చదువుతున్న సమయం నుంచే ప్రేమ పేరుతో వెంటపడుతున్నట్లు తెలిసింది. ఇక ఇటీవలే విఘ్నేష్‌కు పెళ్లి కూడా జరిగింది. భార్య గర్భవతి.. అయినా కూడా పద్ధతి మార్చుకోని విఘ్నేష్.. విద్యార్థినిని వేధిస్తూనే ఉన్నాడు. శనివారం కూడా కాలేజీలో ఉన్న విద్యార్థినికి విఘ్నేష్ ఫోన్ చేశాడు.


అర్జంటుగా కలవాలని.. కలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన విద్యార్థిని కాలేజీ నుంచి ఆటోలో బయల్దేరింది. ఇక ఇదే సమయంలో బద్వేలు పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద విఘ్నేష్ కూడా అదే ఆటోలోకి ఎక్కాడు. బద్వేలు పట్టణానికి కాస్త దూరంగా ఉండే సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమ వద్దకు రాగానే ఇద్దరూ దిగిపోయారు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న ముళ్ల పొదల వద్దకు వెళ్లారు. అయితే తనకు భార్య వద్దు నువ్వే కావాలని, పెళ్లి చేసుకోవాలని విఘ్నేష్ ఒత్తిడి చేసినట్లు బాధితురాలు పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఒప్పుకోకపోవటంతో లైటర్‌తో డ్రెస్సుకు నిప్పంటించినట్లు బాధితురాలు పోలీసుల వద్ద వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.


అయితే గాయాలతో బాధితురాలు కేకలు వేయటంతో పొలాల్లో పనిచేస్తున్న కూలీలు ఆమెను కాపాడారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే నిందితుడు విఘ్నేష్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలికి 80 శాతం గాయాలైనట్లు తెలిసింది. ప్రస్తుతం కడప రిమ్స్ ఆస్పత్రిలో విద్యార్థిని చికిత్స పొందుతోంది. మరోవైపు పెట్రోల్ పోసి నిప్పంటించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. వైద్యులను అడిగి బాధితురాలి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్న సీఎం.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. నిందితుడి కోసం పోలీసులు నాలుగు బృందాలతో గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com