ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవర్రా మీరంతా.. 24 గంటల్లో 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 10:38 PM

కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులతో విమాన ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. విమానాల్లో బాంబులు పెట్టామంటూ చేస్తున్న బెదిరింపులతో అధికారులు, సిబ్బంది.. క్షణం తీరికలేకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గత 24 గంటల వ్యవధిలోనే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాల్లో అణువణువునా గాలింపు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 5 విమానాలు.. ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో 5 విమనాలు.. విస్తారాకు చెందిన 3 విమానాలతో పాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్టార్‌ ఎయిర్‌, అలయన్స్‌ ఎయిర్‌, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు గత 24 గంటల్లోనే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లేందుకు బయల్దేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో దాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టుకు దారిమళ్లించారు. ఇక పారిస్‌-హాంకాంగ్‌.. ఢిల్లీ-పారిస్‌ విస్తారా విమానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు రావడంతో.. వాటిని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.


ముంబై-ఇస్తాంబుల్‌.. ఢిల్లీ-ఇస్తాంబుల్‌.. జోధ్‌పుర్‌-ఢిల్లీ.. హైదరాబాద్‌-చండీగఢ్‌.. జెడ్డా-ముంబై ఇండిగో విమానాలకు శనివారం ఉదయం బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. కొన్నింటిని అత్యవసరంగా ల్యాండ్‌ చేయగా.. మరికొన్నింటిని గాల్లోకి ఎగరకుండానే ఆపేసి తనిఖీలు నిర్వహించారు. ఈ బాంబు బెదిరింపులపై స్పందించిన ఇండిగో.. తమ ప్రయాణికుల భద్రతే అత్యధిక ప్రాధాన్యమని తేల్చి చెప్పింది. ఈ బాంబు బెదిరింపులపై సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.


ఇక దుబాయ్‌ నుంచి జైపుర్‌కు వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపులు రావడంతో దాన్ని జైపూర్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. బెంగళూరు నుంచి ముంబైకి వెళ్లేందుకు టేకాఫ్‌కు సిద్ధమైన ఆకాశ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులను దింపేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఏమీ దొరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత వారం రోజుల్లో 70కి పైగా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీటిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. బాంబు బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై నిషేధం విధించే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవలె స్పష్టం చేశారు. దీనికోసం నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com