ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప భక్తులకు షాక్.. శబరిమల ఆన్‌లైన్ టికెట్ల కోటా తగ్గించిన దేవస్థానం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 11:09 PM

మరికొన్ని రోజుల్లో శబరిమలలో మండల పూజలు, అయ్యప్ప దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ దర్శనాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు టికెట్లను విడుదల చేస్తోంది. అయితే స్పాట్ బుకింగ్ టికెట్లు కాకుండా మొత్తం ఆన్‌లైన్‌లోనే టికెట్లు ఇవ్వాలని ముందుగా నిర్ణయం తీసుకోవడంతో.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో వెనక్కి తగ్గిన దేవస్థానం బోర్డు.. ఆన్‌లైన్ టికెట్లతోపాటు నడకదారిన వచ్చే భక్తులకు కూడా స్పాట్‌ బుకింగ్ టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక రోజూ 80 వేల మందికి శబరిమల అయ్యప్ప దర్శనాలు కల్పించేందుకు.. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇందులో నుంచే ఆన్‌లైన్, స్పాట్ బుకింగ్‌ టికెట్లను కేటాయించారు. అయితే అందులో రోజుకు 70 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో, 10 వేల టికెట్లను స్పాట్ బుకింగ్ కింద జారీ చేయనున్నట్లు వెల్లడించారు.


నవంబర్ 15వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు జరగనున్న మండల, మకరవిళక్కు పూజలకు సంబంధించిన ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే రోజుకు 80 వేల మందికి దర్శనాలు కల్పించేందుకు మొదట ట్రావెన్‌కోర్ బోర్డు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అయితే ఈసారి స్పాట్ బుకింగ్ లేకుండా మొత్తం టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో బోర్డు వెనక్కి తగ్గింది. మొత్తం 80 వేల టికెట్లలో 70 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో.. మిగిలిన 10 వేల టికెట్లను శబరిమలలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కౌంటర్ల ద్వారా అయ్యప్ప భక్తులకు అందించాలని నిర్ణయించింది.


అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు దర్శన వేళలను పెంచినట్లు బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. శబరిమల ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శబరిమలలో తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప దర్శనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక మండల పూజలు నవంబరు 15వ తేదీన ప్రారంభమై డిసెంబరు 26 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి.. మకర విళక్కు పూజలు డిసెంబరు 30 వ తేదీ నుంచి జనవరి 20వ తేదీన జరిగే పడిపూజతో ముగియనున్నాయి. ఇక అయ్యప్ప దర్శనాల్లో అతి ముఖ్యమైన మకర జ్యోతి (మకర విళక్కు) దర్శనం.. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున దర్శనం ఇవ్వనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com