ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబయి- న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 10:12 PM

ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపుల రావడంతో దానిని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం ముంబయి నుంచి 239 మంది బయలుదేరిన ఎయిరిండియా విమానం.. న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానాన్ని ప్రత్యేకంగా ఓ రన్‌వేపై నిలిపి.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.


‘‘ముంబయి నుంచి న్యూయార్క్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అక్టోబరు 14న ఉదయం బయలుదేరిన AI 119 విమానానికి ముప్పు ఉందన్న హెచ్చరికలతో దానిని ఢిల్లీకి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశాం.. విమానంలోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చాం’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి వివరించారు. అనంతరం విమానాన్ని ఓ రన్‌వేపై నిలిపి.. బాంబు స్క్వాడ్ సహా భద్రతా సిబ్బంది ముమ్ముర తనిఖీలు చేస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. విమానంలోని వ్యక్తులందరి భద్రతను నిర్ధారించడానికి ప్రామాణిక భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్నామని తెలిపారు.


‘విమానం ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది.. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన చెప్పారు. కాగా, దీనికి సంబంధించి ఎయిరిండియా ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. భద్రతను నిర్ధారించడానికి సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అధికారులు పనిచేస్తున్నారు. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణీకులు ఎదురుచూపులు చూస్తున్నారు. తదుపరి సూచనలు కోసం వారితో పాటు సిబ్బంది వేచి చూస్తున్నారు.


రెండు రోజుల కిందట తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దానిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. విమానం గాలిలో ఉండగానే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్ వ్యవస్థ పని చేయడం లేదని గుర్తించిన పైలట్లు విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందికి దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, దీనికి ముందు రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. ప్రయాణికులంతా భయపడిపోయారు. విమానం సురక్షితంగా దిగిన తర్వాత వారంతా కేరింతలు కొడుతూ గంతలు వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com