ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 09:43 PM

ఏపీవాసులకు ముఖ్య గమనిక.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలవైపు కదులుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం రెండు, మూడు చోట్ల భారీ నుంచి అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.


మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లరాదని సూచించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇక పెన్నానదీ పరివాహకంలో ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పొంగి పొర్లుతున్న వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది. విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండొద్దని సూచించింది. అలాగే పాత భవనాలు వదిలి సురక్షిత భవనాల్లోకి వెళ్ళాలని.. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వానికి సైతం విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది.ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించింది. అలాగే సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించాలని సూచించింది. భారీ వర్షాలకు పొంగిపొర్లే రోడ్లను వెంటనే మూసివేయాలని.. ప్రమాదకర కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివశించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. రోడ్ల మీద నీళ్లు నిలవకుండా డ్రైనేజీలు శుభ్రం చేయాలని సూచించింది. కాలువలు, చెరువులు, వాగులను జలవనరుల శాఖ అధికారులు ఓ కంట పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించింది.


మరోవైపు అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే చిత్తూరు, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com