ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలులో రామ్‌లీలా నాటకం.. సీతను వెతుకుతూ పరారైన ఇద్ద‌రు ఖైదీలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 10:12 PM

దసరా సందర్భంగా జైలులో ప్ర‌ద‌ర్శించిన‌ నాటకంలో పాత్రధారులుగా నటించిన ఖైదీలు.. ఇదే అదునుగా అధికారులకు మస్కా కొట్టారు. రామ్‌లీలా నాటకంలో భాగంగా వానరులుు వేషాలు వేసిన ఇద్దరు ఖైదీలు నిచ్చెన సాయంతో జైలు గోడ దూకి పరారయ్యారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన రోష్నాబాద్ జైలులోనే ఇలా జరగడం గమనార్హం. సీతాన్వేషణ ఘట్టం జరుగుతుండగా.. వాన‌రుల వేషధారణలో ఉన్న పంకజ్‌, రాజ్‌కుమార్ అనే ఇద్ద‌రు ఖైదీలు త‌ప్పించుకున్నారు. దాంతో వారి కోసం ఉత్తరాఖండ్ పోలీసులు గాలిస్తున్నారు.


నాటకం రసవత్తరంగా సాగుతుండటం, జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా అందులో లీనమైపోవడంతో ఇదే అదునుగా భావించిన వానర వేషంలో ఉన్న ఇద్దరు ఖైదీలు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న నిచ్చెన ద్వారా గోడ దూకి పరారయ్యారు. వాళ్లు పరారైన విషయం మర్నాడు సాయంత్రం వరకు గానీ అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ఖైదీల రోజువారీ హాజరులో భాగంగా ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నట్టు తేలింది. దీంతో అధికారులు.. జైలు మొత్తం గాలించారు. అయినప్పటికీ వారి జాడ కనిపించకపోవడంతో చివరకు శనివారం సాయంత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు


ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన పంకజ్‌.. ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండగా.. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరూ జైలులో నిర్మాణ పనుల కోసం కార్మికుల గోడపైకి ఎక్కేందుకు అక్కడ ఉంచిన నిచ్చెన‌ను ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగినప్పుడు మిగతా ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా రామలీలాను వీక్షిస్తున్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసి, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.


పరారైన ఖైదీలను పట్టుకునేందుకు ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చేస్తున్నామని, వారిని గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా రోష్నాబాద్ జైలులో ఖైదీలతో రామలీలా నిర్వహిస్తుంటారు. ఖైదీలు నిచ్చెన ఎక్కి తప్పించుకుంటున్న దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉత్తరాఖండ్ జైళ్ల శాఖ ఐజీ విమల గుజ్యాల్, డీఐజీ దాధీరామ్ మౌర్యలు రోష్నాబాద్ జైలును శనివారం పరిశీలించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, ఏదైనా భద్రతా వైఫల్యం ఉన్నట్టు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, దీనికి ముందు రోజే అసోంలోని జైలు నుంచి ఐదుగురు ఖైదీలు తప్పించుకున్న ఘటన చోటుచేసుకుంది. లుంగీలు, టవల్స్‌ను తాళ్లుగా మార్చి గోడ దూకి పరారయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com