ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి మోదీ మరో శుభవార్త.. ఆయుష్మాన్ భారత్‌‌లోకి మరిన్ని ప్యాకేజీలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 10:13 PM

‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)’ పథకాన్ని 70 ఏళ్ల దాటిన వృద్ధులకు వర్తింప జేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ చికిత్సలతో పాటు 1,949 వైద్య సేవలను ఈ పథకంలో ఇప్పటికే చేర్చారు.


ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత రెండు వారాలకు సరిపడే ఔషధాలు అందించడం, ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు వరకు చేయించుకున్న వ్యాధి నిర్థారణ పరీక్షల ఖర్చునూ పరిగణనలో తీసుకోవడం వంటివి ఈ పథకంలో ఉన్నాయి. ఆహారం, వసతితో సహా ఆసుపత్రి సేవలు లబ్ధిదారులకు ఉచితంగా అందుతాయి. పేద, ధనిక వర్గాలు తేడా లేకుండా 70 ఏళ్లు, ఆపై వయసు పైబడినవారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేయడంతో 4.5 కుటుంబాల్లోని 6 కోట్ల మందికి లబ్ది కలగనుంది.


‘ఈ పథకం కింద ఆరోగ్య-ప్రయోజన ప్యాకేజీలపై నిర్ణయం తీసుకునే కమిటీ మరిన్ని ప్యాకేజీలను జోడించాల్సిన అవసరం గురించి చర్చిస్తోంది.. ఇది ప్రత్యేకంగా వృద్ధాప్య సంరక్షణకు మొగ్గు చూపుతుంది.. ఈ పథకం ప్రారంభంతో అటువంటి లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది’ అని అధికారులు తెలిపారు. అల్జీమర్స్, డెమెన్షియా వంటి కొన్ని మానసిక-ఆరోగ్య చికిత్సలు కూడా ప్రస్తుత పథకం కిందకు రానున్నాయి.


సెప్టెంబరు 1 వరకు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ మినహా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ కింద 12,696 ప్రయివేట్ ఆసుపత్రులు సహా 29,648 ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 7.37 కోట్ల మంది ఆసుపత్రుల్లో చేరారని.. వీరిలో 49 శాతం మంది మహిళలు ఉన్నారు. ఈ పథకం కింద రూ.లక్ష కోట్లకుపైగా ప్రజలు లబ్ధి పొందారని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది. జనాభాలో 40 శాతంగా ఉన్న 10.74 కోట్ల పేద, బలహీన కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయని తెలిపింది.


కాగా, ఆయుష్మాన్ భారత్‌ పథకంలో అర్హులైన సీనియర్ సిటిజన్ల పేర్ల నమోదుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ పథకం ప్రయోజనం పొందాలనుకునే సీనియర్‌ సిటిజన్ల నమోదుకు ఆయుష్మాన్‌ మొబైల్‌ యాప్‌ (Ayushman), వెబ్‌సైట్‌లో (Beneficiary.nha.gov.in) ప్రత్యేక విభాగం తీసుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com