ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత.. తేదీలు ప్రకటించిన కమిటీ

national |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 10:52 PM

దేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే చార్‌ ధామ్ యాత్ర ఏటా వేసవిలో మొదలై.. శీతాకాలం వరకు కొనసాగుతుంది. ఏడాదిలో ఆరు నెలల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం వల్ల శీతాకాలంలో మంచు తీవ్రత దృష్ట్యా యాత్రను నిలిపివేస్తారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలనే ఛార్‌ధామ్‌గా పిలుస్తారు. హిమాలయాల్లోని ఈ ఆలయాలను దర్శించుకోడానికి వేసవి నుంచి శీతాకాలం వరకు మాత్రమే అనుతిస్తారు. ఈ ఏడాది ఛార్‌ధామ్ యాత్ర ముగింపు తేదీలను కేదార్‌నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ తాజాగా ప్రకటించింది. సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.


తొలుత యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్, చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నామని చెప్పారు. యమునోత్రిలో మాత యమున, గంగోత్రిలో గంగామాత, కేదార్‌నాథ్‌లో పరమేశ్వరుడు, బద్రీనాథ్‌లో శ్రీమన్నారాయణుడు పూజలందుకుంటారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఛార్‌ ధామ్ యాత్రకు 38 లక్షల మంది భక్తులు వచ్చారని అజయ్ వెల్లడించారు. వీరిలో 11 లక్షల మందికి పైగా భక్తులు బద్రీనాథ్‌ను, 13.5 లక్షల భక్తులు కేథార్‌నాథ్‌ను సందర్శించారని చెప్పారు.


గంగోత్రి ఆలయాన్ని నవంబరు 2 మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేస్తారు. అలాగే, కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను నవంబర్ 3న మూసివేస్తున్నట్టు ఇంతకుముందే ప్రకటించారు. బద్రీనాథ్ ఆలయాన్ని నవంబరు 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నట్టు ఆలయ కమిటీ ఛైర్మన్ వెల్లడించారు. ఆ రోజు సాయంత్రం చివరి పూజ నిర్వహించి, అక్కడ అఖండ జ్యోతిని వెలిగించి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. వీటితో పాటు, రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలు అక్టోబర్ 17న మూసుకోనుండగా.. నవంబర్ 4న తుంగనాథ్, నవంబర్ 20న మధ్యమహేశ్వర్ మూతపడనున్నాయి.


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న చార్ ధామ్‌‌లను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలి కాలమంతా మంచు కప్పి ఉంటుంది. వాటిని దర్శించుకోవడం కుదరదు. అందువల్ల ఆరు నెలల పాటు దేవాలయాను మూసేసి ఉంచుతారు. భూమికి 10 వేల నుంచి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి.


కాగా, ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన కేదార్‌నాథ్ సముద్ర మట్టానికి 3,583 మీటర్ల ఎత్తులో మందాకినీ నది పక్కన ఉంది. ప్రపంచంలోని శివుడి ప్రత్యేకమైన ఆలయాల్లో ఇది ఒకటి. పరవేశ్వరుడ, ఆయన భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఇదొకటి. సుమారు 1200 సంవత్సరాల క్రితం ఛార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com