ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుబాబులకు సూపర్ న్యూస్.. ఇంకో రెండు రోజులే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 07:12 PM

ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు గుడ్ న్యూస్.. మరో రెండు రోజుల్లో ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. అక్టోబర్ 16 నుంచి ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలు కానుంది. ఇక నూతన విధానంలో బ్రాండెండ్ మద్యం అందుబాటులోకి రానుంది. అలాగే క్వార్టర్ రూ.99 లకే నాణ్యమైన మద్యం అందిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి ఏపీవాసులకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రానుంది. మరోవైపు ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడిచాయి. ఇక నూతన మద్యం విధానం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు మద్యం షాపులు నిర్వహిస్తారు. లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు.


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 3396 మద్యం దుకాణాలకు ఏపీ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం వరకూ కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఇక 3,396 మద్యం షాపులకు గానూ 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు రుసుము రూపంలో రూ.2 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. ఈ ప్రకారం 89,882 దరఖాస్తులకు గానూ ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 లిక్కర్ షాపులకు 5764 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు అనంతపురం జిల్లాలోని 12 లిక్కర్ షాపులకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని ఎక్సైజ్ శాఖ అధికారులు పునఃపరిశీలించాలని భావిస్తున్నారు.


మరోవైపు రాష్ట్ర్లంలో 3396 మద్యం దుకాణాలు ఉండగా.. సగటున ప్రతి మద్యం షాపునకు 25 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు జిల్లాలో అయితే 50 వరకూ వచ్చినట్లు తెలిసింది. దాఖలైన దరఖాస్తులను 12,13వ తేదీలలో ఎక్సైజ్ శాఖ పరిశీలించింది. అక్టోబర్ 14న తేదీన జిల్లాల వారీగా లాటరీ తీస్తారు. ఈ లాటరీ కూడా మాన్యువల్ పద్ధతిలో ఉంటుంది. ఇక డ్రాలో గెలిచిన వారు 24 గంటల్లోగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లాటరీలో గెలిచిన వారికి అక్టోబర్ 15న మద్యం దుకాణాలను అప్పగిస్తారు. అక్టోబర్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. మరోవైపు మనదేశంలో తయారైన విదేశీ లిక్కర్ బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు ప్రభుత్వం అదనపు ప్రివిలేజ్ ఫీజును విధించనుంది. చిల్లర సమస్య లేకుండా చేసేందుకు దానిని సర్దుబాటు చేసేలా ఈ అదనపు ప్రివిలేజ్ ఫీజును విధించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com