ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గ గుడికి వచ్చిన సరుకులు వెనక్కి.. పదిరోజుల్లో ఇది మూడోసారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 07:56 PM

తిరుమల లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీ అనే కాదు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ప్రసాదాల నాణ్యతపై అధికారులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తర్వాత.. అంత ప్రసిద్ధి చెందిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం విషయంలోనూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం విజయవాడ కనకదుర్గమ్మ అలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చిన సరుకులను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. అయితే ఈ తనిఖీల్లో కిస్మిస్‌లలో నాణ్యత లేని విషయాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే 200 బాక్సుల కిస్మిస్ వెనక్కి పంపారు.


నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సరఫరా చేసిన కిస్మిస్‌లతో పోలిస్తే.. తాజాగా పంపించిన కిస్మిస్‌లు పరిమాణం, నాణ్యతలో తక్కువగా ఉండటమే వెనక్కి పంపడానికి కారణమని తెలిసింది. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చిన సరుకులను ఇలా వెనక్కి పంపడం గడిచిన పది రోజుల్లో ఇది మూడోసారి. దీంతో సరుకులను పంపుతున్న కాంట్రాక్టర్ మీద అధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


కనకదుర్గమ్మ వీఐపీ భక్తులకు అధికారుల రిక్వెస్ట్


మరోవైపు దసరా నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే వీఐపీ భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనానికి రావాలని కోరారు. రేపటి నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీఐపీ భక్తులు టైమ్ స్లాట్‌లోనే అమ్మవారి దర్శనానికి రావాలని స్థానిక కలెక్టర్ సృజన కోరారు. ఇక అమ్మవారి దర్శనానికి సంబంధించి 300 రూపాయల క్యూలైన్ దర్శనం వేగంగా జరుగుతోందని.. కానీ.. రూ.500 దర్శనం కాస్త ఆలస్యంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. వీఐపీ దర్శనాలకు యాప్ అందుబాటులోకి తెచ్చామన్న అధికారులు.. వీటిని వినియోగించుకోవాలని సూచించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com