ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నాడీఎంకేకు మద్దతుగా పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 07:54 PM

తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఎక్కడికో దారితీస్తున్నాయి. వారాహి డిక్లరేషన్ చేస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్.. ఇదే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సనాతన ధర్మం జోలికి వస్తే కొట్టుకుపోతారంటూ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఇక అక్కడ చెలరేగిన మంట.. ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదు. ఎందుకంటే ఈ విషయం మీద ఉదయనిధి స్టాలిన్ స్పందించకపోయినా.. డీఎంకే పార్టీ, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా రియాక్టవుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు.


ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం డీఎంకే పార్టీకి బద్ధశత్రువైన.. అన్నాడీఎంకే పార్టీ గురించి ట్వీట్లు చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటై 53 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎంజీఆర్ గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నతనంలో చెన్నైలో ఉన్నప్పుడు ఎంజీఆర్ గారి ప్రేమ, అభిమానం చూశానన్న పవన్ కళ్యాణ్.. అవి ఎప్పటికీ అలాగే తన గుండెల్లో ఉంటాయన్నారు. మైలాపూర్‌లో చదువుతున్న సమయంలో తమ తమిళ టీచర్ ద్వారా పురుచ్చితలైవర్ పరిచయం కలిగిందని పవన్ చెప్పారు. పరోపకారం, దయ, నిష్కపటత్వం, ప్రజల పట్ల శ్రద్ధ ఈ నాలుగు విషయాలను కలిగి ఉన్న రాజులా ఆయన కనిపించారంటూ పవన్ రాసుకొచ్చారు.


ఇక పవన్ కళ్యాణ్‌ ట్వీట్‌కు అన్నాడీఎంకే లీడర్ పళనిస్వామి సైతం ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు ఈ ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్.. డీఎంకే వైరి పక్షమైన అన్నాడీఎంకేకు దగ్గరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చర్చ ఇలా నడుస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు,తమిళనాడు విశేషాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


సిద్ధులు, సాధువులు నెలవైన ప్రాంతం తమిళనాడు అని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. చనిపోయిన తన తండ్రి కూడా స్వామి రామకృష్ణ పరమహంస, శారదా మా, స్వామి వివేకానందకు అమితమైన భక్తుడని చెప్పుకొచ్చారు. ఆయన రాంచీ నుంచి క్రియ యోగ దీక్ష తీసుకున్నారని.. ఆ తర్వాత తామంతా కూడా క్రియ యోగ తీసుకునేలా ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. 80వ దశకం చివరలో, అలాగే 90 ప్రారంభంలో తన తండ్రి చెన్నైలోని శాంతోమ్‌లో ఉన్న మహావతార్ బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించినట్లు చెప్పారు. తిరునల్వేలిలోని యోగి రామ్ సూరత్ కుమార్‌కు తరుచూ సేవలు చేసుకుంటూ ఉండేవారని పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. సంస్కృతి, భక్తి ఆచారాలకు తమిళనాడు నిలయమన్న పవన్ కళ్యాణ్.. అనేక మంది యోగులు, సాధుపుంగవులతో ఈ భూమి పవిత్రమైందని పేర్కొన్నారు. మొత్తంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య తలెత్తిన వ్యవహారం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com