ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు... నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 07:02 PM

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులూ ఒక్కో అవతారంలో జగన్మాతను అలకరిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం (అక్టోబరు 6) విజయవాడ కనకదుర్గమ్మ.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కుడివైపున ల‌క్ష్మీదేవి, ఎడ‌మ వైపున స‌ర‌స్వ‌తీదేవి సేవ‌లు చేస్తుండ‌గా చెఱ‌కుగ‌డ‌, విల్లు, పాశాంకుశాల‌ను ధ‌రించి ఎరుపు, నీలం రంగు చీరలో ఓంకార రూపిణి అయిన అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున అమ్మ‌వారికి రాజ‌భోగం పేరుతో పాయ‌సాన్నం, చ‌క్రాన్నం, పూర్ణాలు, అల్లం గారెలు ఇలా ప‌ది ర‌కాలను నైవేద్యాల‌ుగా సమర్పిస్తారు.


త్రిపురాత్రయంలో రెండోశక్తి లలితాదేవి. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ దేవి అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులై త్రిమూర్తల కన్నా పూర్వం నుంచి జగన్మాత ఉంది కాబట్టి త్రిపుర సుందరీ అనే నామంతో పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాక్ణరీ మహామంత్రాధి దేవతగా వేంపుచేసి తనని కొలిచే భక్తులను, ఉపాసకులకు అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. లలితా త్రిపుర సుందరీ దేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


శ్లోకం: ‘సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా’ అంటూ అమ్మవారిని సేవిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఈ రోజున లలితా సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు. ఇక, శనివారం అన్నపూర్ణదేవి రూపంలో ఉన్న జగన్మాతను దాదాపు 80 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శరన్నవరాత్రుల మొదటి మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. నేడు ఆదివారం కావడంతో దుర్గగుడికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.


ఇక, సాయంత్రం వేళ మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి నిర్వహిస్తుండటంతో సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకూ దర్శనాలను నిలిపేస్తున్నారు. దీంతో సాయంత్రం నుంచి క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అదనంగా ఆభరణాలను భక్తులు సమర్పిస్తున్నారు. ఓ అజ్ఞాత భక్తుడు ఉత్సవాల తొలిరోజు రూ.2.50 కోట్ల విలువైన వజ్రకిరీటాన్ని అందజేశాడు. ఆదివారం రూ.18 లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాలను, ఆరు కిలోల భారీ వెండి హంస పీఠాన్ని భక్తులు సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com