ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృత్యువుతో పోరాడుతోన్న యువకుడు.. వీరాభిమాని కోరిక నెరవేర్చిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 07:00 PM

కేన్సర్‌ బారినడి మృత్యువుతో పోరాడుతున్న ఆ యువకుడికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అంటే ఎంతో ఇష్టం. బాబుకు వీరాభిమాని అయిన అతడు.. ఒక్కసారైన ఆయనతో ఫోటో దిగాలనేది కోరిక. తాను కన్నుమూసేలోగా చంద్రబాబును కలవాలని అనుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు టీడీపీ నేతల ద్వారా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఈ విషయం తమ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు చెప్పారు. తన కోసం ఎదురుచూస్తోన్న ఆ అభిమానిని సీఎం ఆశ్చర్యంలో ముంచెత్తారు. అతడి ఆకాంక్షను నెరవేర్చడమే కాదు.. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడు పసుపులేటి సురేంద్రబాబు (30) అనే యువకుడికి చంద్రబాబు నాయుడు అంటే అభిమానం. కేన్సర్ బాధితుడైన అతడికి జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబుతో ఫొటో దిగాలనేది ఆకాంక్ష. స్థానిక నాయకుల ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి ఈ విషయం గురించి గురించి తెలియజేయడంతో ఆయన చంద్రబాబు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం అందించారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న సీఎం.. తన అభిమానిని పరామర్శించాలని నిర్ణయించారు.


శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమలకు వచ్చిన పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు.. శనివారం ఉదయం పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం ఎక్కేందుకు వెళ్తోన్న సమయంలో తన వాహనం దిగి వచ్చిన ముఖ్యమంత్రి.. అభిమాని సురేంద్రబాబును కలిశారు. తన అభిమాన నాయకుడు వచ్చి కలవడంతో ఉబ్బితుబ్బుబ్బయ్యాడు. సంతోషంతో ఉప్పొంగిపోయిన అతడు... ఫోటో దిగాడు. ఇక, సురేంద్ర తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అతడి కోరికను నెరవేర్చడమే కాకుండా.. చికిత్స నిమిత్తం రూ.5 లక్షల చెక్కును చంద్రబాబు అందజేశారు. అంతేకాదు, సురేంద్రకు ఏ అవసరం ఉన్నా తన వద్దకు తీసుకురావాలని స్థానిక నాయకులకు సూచించి మానవత్వం చాటుకున్నారు.


అయితే, తన జీవిత చివరి ఘడియాల్లో ఇది మరుపురాని ఘటన అని సురేంద్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సురేంద్రబాబుకు కేన్సర్ నాలుగో దశలో ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అతడు మహమ్మారిని జయించి.. బతికే అవకాశం లేదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com