ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాధారణ వ్యక్తి ట్వీట్‌కు కదిలొచ్చిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం, మంత్రి క్విక్ రియాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:28 PM

సోషల్ మీడియా.. అది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. కూరగాయలూ తరగొచ్చు.. కుత్తుకలూ కోయొచ్చు. కానీ ఇప్పటి యువతరంలో మెజారిటీ భాగం సోషల్ మీడియాను ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌గా, రీల్స్ పిచ్చితో, ఫాలోవర్ల పెంచుకోవాలనే తాపత్రయంతో వాడుతూ బతికేస్తున్నారు. కానీ అదే సోషల్ మీడియా ద్వారా మన సమస్యను ప్రపంచానికి తెలియజేయొచ్చు. మారుమూల గ్రామం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రపంచం ముంగింట పెట్టొచ్చు. ప్రభుత్వాలు సకాలంలో స్పందిస్తే దానికి పరిష్కారం కూడా లభించవచ్చు. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. తమ ఊరి సమస్యను ఓ యువకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా.. కేవలం గంటల వ్యవధిలోనే ప్రభుత్వం, మంత్రులు స్పందించడం విశేషం.


విజయనగరం జిల్లాకు చెందిన జశ్వంత్ అనే యువకుడు తమ ఊరి సమస్యను వీడియో తీసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు షేర్ చేశాడు. ఏళ్లు గడుస్తున్నా తమ ఊరి పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని.. మీరైనా పరిష్కరించాలంటూ కోరాడు. " మాది విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం జామి మండలంలోని శాసనపల్లి అనే ఊరు. ఊరు చుట్టూ నీరు ఉండటం ఈ ఊరు చేసుకున్న పాపం. ఈ ఊరు మీద నుంచి వేరే ఊరికి పోవటానికి రోడ్డు మార్గం లేకపోవటం ఈ ఊరికి ఉన్న శాపం. ఉన్న ఒక్క మార్గం కూడా వర్షాకాలం వస్తే నీటితో నిండిపోతోంది."


"చదువులకు, నిత్యావసర సరుకులకు పెదపామిలి అనే పక్క ఊరే మాకు దిక్కు. మా ఊరికి దానికి మధ్య దూరం రెండు కిలోమీటర్లు. ఈ రెండు కిలోమీటర్లు వెళ్లాలంటే.. రెండు వందల మీటర్ల గెడ్డ దాటాలి. ఊరు పుట్టినప్పటి నుంచి ఈ గెడ్డపై బ్రిడ్జి కట్టాలని కోరుతున్నాం. నాయకులేమో.. ఎన్నికల సమయంలో మాటిస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. బ్రిడ్జి లేకపోవటంతో ఏడాదిలో నాలుగు నెలలు విద్యార్థులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఉపాధిలేక జనం వలసెళ్లి పోతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పట్టించుకోవాలని కోరుతున్నా" అంటూ ఊరి సమస్యను వీడియో తీసి ఆ యువకుడు షేర్ చేశాడు.


మా ఊరి సమస్య గురించి మిమ్నల్ని నేరుగా కలిసి చెప్పుకుందామని అనుకుంటే.. మిమ్మల్ని నేరుగా కలవడం మాకు చాలా కష్టమని.. కానీ మా వీడియో మీకు సులభంగా చేరుతుందనే ఆశతో ఈ పనిచేస్తున్నట్లు జశ్వంత్ వీడియో షేర్ చేశాడు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోని ఈ సమస్యను మీరైనా పరిష్కరిస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను ట్యాగ్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయాన్ని విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తామని.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారంటూ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం బదులిచ్చింది. ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూనే.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కొంచెం సమయం ఇవ్వాలని కోరింది.


అటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం దీనిపై స్పందించారు. శాసనపల్లి గ్రామం బ్రిడ్జి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 2018లోనే ఇక్కడ వంతెన నిర్మాణానికి అనుమతి వచ్చిందని మంత్రి తెలిపారు. 90 లక్షల బడ్జెట్‌తో వంతెన నిర్మాణం మంజూరైందని.. అయితే గత వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణం బడ్జెట్ వ్యయం.. రూ.4 కోట్లకు చేరి ఉంటుందని.. నిధుల కేటాయింపు జరిగిన వెంటనే వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. సదరు నెటిజన్‌కు బదులిచ్చారు. వేగంగా స్పందించినందుకు ఆ నెటిజన్.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వీలైనంత త్వరగా తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com