ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకౌంట్ నంబర్ తప్పు కొట్టిన ఎలాన్ మస్క్.. వేరే వాళ్ల ఖాతాలోకి రూ.44 కోట్లు

international |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 10:01 PM

మనం చాలా సార్లు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు పంపిస్తూ ఉంటాం. గూగుల్ పే, ఫోన్ పే సహా పలు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాం. అయితే డబ్బులు పంపించేటపుడు ఒకటికి రెండుసార్లు అకౌంట్ నంబర్లు చెక్ చేసుకోవాలి. లేదంటే మనం పంపాల్సిన వారికి కాకుండా వేరే వాళ్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. కొన్ని సార్లు పొరపాటున తప్పు అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తే ఇతరుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడిన సంఘటనలు కూడా ఉంటాయి. అయితే వాటిని తిరిగి తెచ్చుకోవడం అంత సులభమైన పని కాదు. చాలా మంది డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఆసక్తి చూపరు. ఇలాంటి పరిస్థితే ప్రపంచంలోనే అపర కుబేరుడు.. టెస్లా, ట్విటర్, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు వచ్చింది.


అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో ఎలాన్ మస్క్‌కు బ్రెజిల్‌ కోర్టు భారీగా జరిమానా విధించింది. 5.2 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.44 కోట్ల ఫైన్ వేసింది. ఆ మొత్తాన్ని బ్రెజిల్ కోర్టు ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్.. రూ.44 కోట్లను బ్రెజిల్ కోర్టు బ్యాంక్ అకౌంట్‌లో జమచేస్తుండగా చిన్న తప్పిదం జరిగింది. బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేసే సమయంలో తప్పు జరిగింది. కోర్టు ఖాతాలోకి కాకుండా మరో ఖాతాలోకి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే ఈ విషయాన్ని బ్రెజిల్ కోర్టు జడ్జి మోరేస్ తెలిపారు.


అసస్య సమాచార వ్యాప్తికి సంబంధించిన కేసులో ట్విటర్‌పై పడిన జరిమానా మొత్తాన్ని ఆ సంస్థ చెల్లించిందని.. అయితే అది కోర్టు ఆర్డర్‌పై ఉన్న ఖాతాకు కాకుండా మరొక ఖాతాకు డబ్బు చెల్లించిందని చెప్పారు. ఈ విషయాన్ని తాము గుర్తించామని.. వెంటనే ఆ మొత్తాన్ని కోర్టు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు కోర్టు స్పష్టం చేసింది. ఇక బ్రెజిల్‌లో ట్విటర్‌పై విధించిన నిషేధం.. ఇంకా కొనసాగుతూనే ఉంది.


అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పలు ట్విటర్ ఖాతాలను తొలగించాలని గతంలో బ్రెజిల్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్‌ డె మోరాసే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆ దేశంలో ట్విటర్ సేవలు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే బ్రెజిల్ కోర్టు ఆదేశాలపై ఎలాన్‌మస్క్‌ స్పందించారు. వాక్‌స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది అని.. ప్రజా ఆమోదంతో ఎన్నిక కాని జడ్జి.. ఈ పునాదిని రాజకీయ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల బ్రెజిల్‌ నుంచి ట్విటర్‌కు వస్తున్న ఆదాయం మొత్తం పోతోందని.. ఫలితంగా అక్కడ తమ కార్యకలాపాలను మూసివేయాల్సి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. అయినా తాము బాధపడటం లేదని.. లాభాల కంటే సిద్ధాంతాలే ముఖ్యమని తేల్చి చెప్పారు.


దీంతో ఎలాన్ మస్క్, బ్రెజిల్ జడ్జి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్‌‌పై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య సమాచార సమాచార వ్యాప్తిపై జరుగుతున్న విచారణలో ఎలాన్ మస్క్‌ పేరును కూడా చేర్చారు. మరోవైపు.. కోర్టు కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని.. తీర్పులను కించపరిచేలా మాట్లాడారని ఎలాన్ మస్క్‌కు కోర్టు రూ.44 కోట్ల భారీ జరిమానాను విధించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com