ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్.. పదవిలోకి వచ్చిన 4 రోజుల్లోనే!

international |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 10:00 PM

హెజ్‌బొల్లా కొత్త చీఫ్ హషేమ్ సఫీద్దీన్‌ని ఇజ్రాయెల్ సైన్యం అంతం చేసిందని వార్తలు వస్తున్నాయి. హెజ్‌బొల్లా అధినేతగా బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల్లోనే సఫీద్దీన్‌ని ఇజ్రాయెల్ అంతమొందించిందని స్థానిక మీడియా చెబుతోంది. లెబనాన్ రాజధాని బీరుట్‌‌పై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన ఎయిర్‌‌స్ట్రైక్‌లో హషేమ్ సఫీద్దీన్‌తో పాటు హెజ్‌బొల్లా కీలక నేతలు మరణించినట్లు సమాచారం. అండర్‌గ్రౌండ్ బంకర్‌లో తలదాచుకున్న వీరిపై ఐడీఎఫ్ బాంబుల వర్షం కురిపించిందని.. ఈ దాడుల్లో సఫీద్దీన్ చనిపోయారని అంటున్నారు. దక్షిణ బీరుట్‌‌లోని దహీహ్ ప్రాంతంలో హెజ్‌బొల్లా సీనియర్ లీడర్లు సమావేశం అవుతున్నట్టు ఐడీఎఫ్‌కు సమాచారం అందడంతో ఎయిర్‌స్ట్రైక్ చేశారని జెరూసలేం పోస్ట్ వెల్లడించింది.


అలాగే, ఈ దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్‌కు చెందిన ఖుడ్స్ ఫోర్స్ కమాండర్, ఇరానియన్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇరాన్ దన్నుతో బలపడిన హెజ్‌బొల్లా మిలటరీ ఆపరేషన్స్‌కు హషేమ్ సఫీద్దీన్ నాయకత్వం వహించారు. హసన్ నస్రల్లాకు వారసుడిగా సఫీద్దీన్‌ను హెజ్‌బొల్లా పరిగణించింది. అంతేకాదు, నస్రల్లాకు సఫీద్దీన్ కజిన్. అందుకే, వారం రోజుల క్రితం హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతమొందించగా.. ఆయన స్థానంలో హెజ్‌బొల్లా అధినేతగా సఫీద్దీన్ పగ్గాలు చేపట్టారు. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని.. బుద్ధి చెప్తామని వ్యాఖ్యలు చేశారు.


అయితే, హెజ్‌బొల్లా సంస్థను తుడిచిపెట్టేయడమే తమ లక్ష్యమని.. సఫీద్దీన్‌కు కూడా మట్టుబెడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. చెప్పటినట్టుగానే.. సఫీద్దీన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల్లోనే లేపేసింది. ఇదిలా ఉంటే, ఉత్తర లెబనాన్‌లో ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన అల్‌ ఖసమ్‌ బ్రిగేడ్‌ సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్‌ అతల్లా మృతి చెందారు. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు సైతం మరణించినట్లు సమాచారం.


ఈ మేరకు హమాస్‌కు చెందిన పలు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన పలు వార్తాసంస్థలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. చనిపోయిన వారిలో 127 మంది పిల్లలు, 261 మంది మహిళలు ఉన్నట్టు పేర్కొంది. మృతిచెందిన ఈ 2వేల మందిలో 250 మంది హెజ్‌బొల్లాకు చెందినవారని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com