శుక్రవారం ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ భీకర ఎన్కౌంటర్ తర్వాత సంఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్ట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టినట్లు వివరించారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
వివిధ రాష్ట్రాల మావోయిస్ట్ అగ్రనేతలు మరణించినట్లు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేష్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ చనిపోయినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు.. ఆ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 31 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్.. ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా కూడా కమలేష్ వ్యవహరించాడు. ఇక నీతి అలియాస్ ఊర్మిళ కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారని.. ఆమె కూడా దళంలో కీలక నేత అని పేర్కొన్నారు. మరోవైపు.. కమలేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతం అని తెలుస్తోంది.
ఇక ఛత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్పై పౌర హక్కుల సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చనిపోయిన మావోయిస్టుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేసింది. బస్తర్ రేంజ్లోని నారాయణ్పూర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ భారీ ఎన్కౌంటర్ ప్రారంభం అయింది.
అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు గుమిగూడారని పోలీసులు, భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. అందులో కొందరు అగ్రనేతలు కూడా ఉన్నారనే సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు.. కాల్పులకు దిగారు. దీంతో ఎదురు కాల్పులు మొదలుపెట్టిన పోలీసులు.. భారీగా మావోయిస్టులను హతం చేశారు.