ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖైదీలకు మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ.. దుర్గా పూజ వేళ ప్రభుత్వం నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:42 PM

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలకు శుభవార్త అందించింది. కుటుంబ సభ్యులకు దూరంగా జైలులో ఉంటున్న వారికి నవరాత్రుల సందర్భంగా పసందైన వంటకాలతో భోజనం అందించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు సహా అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను లంచ్, డిన్నర్ మెనూలో చేర్చనున్నట్లు స్పష్టం చేసింది. ఖైదీల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఈ దసరా పండగ సందర్భంగా దుర్గా పూజలు జరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


తెలిసీ తెలియక తప్పులు చేసి.. చేసిన తప్పుకు శిక్ష పడి జైలుకు వెళ్లిన ఖైదీల విషయంలో దీదీ సర్కార్ పెద్ద మనసు చాటుకుంది. ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లల్లో ఉండే ఖైదీలకు లంచ్, డిన్నర్ సమయంలో రకరకాల వంటకాలను వడ్డించనున్నట్లు పేర్కొంది. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్, మాచెర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర), మాచెర్ మాతా దియే దాల్ (చేప తలతో పప్పు) వంటి వంటకాల రుచి చూపించనున్నారు. పండగ సంతోషాన్ని కోల్పోతున్నామనే బాధ లేకుండా చేసేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆహార పదార్థాలన్నీ జైలులో ఉండే ఖైదీల చేతనే తయారు చేయించనున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.


ఈ వంటకాలను ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలకు కూడా అందించనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. నవరాత్రి సమయంలో షష్టి నుంచి దశమి వరకు లంచ్, డిన్నర్ ఈ మెనూ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఇక దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతీ సంవత్సరం మంచి ఆహారాన్ని అందిస్తామని జైలు అధికారులు వెల్లడించారు. ఈసారి మాత్రం ఖైదీల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఖైదీల ముఖాల్లో చిరునవ్వు తెచ్చేందుకే ఈ ప్రయత్నం అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో ఖైదీల జీవితాల్లో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు.


మాచర్ మాతా దియే పుయ్ షక్, మాచెర్ మాతా దియే దాల్, లూచీ-చోలార్ దాల్, పాయేష్, చికెన్ కర్రీ, ఆలు వడ్డిస్తారు. పొటోల్ చింగ్రీ, మటన్ బిర్యానీ విత్ రైతా, బసంతి పులావ్ అందిస్తారు. మరోవైపు.. బలవంతంగా ఖైదీలకు ఆహారాన్ని అందించమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. ఎవరి మతాల ఆచారాల ప్రకారం వారికి నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com