ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుల జారీలో ఆలస్యం.. సుప్రీంకోర్టు సీరియస్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:34 PM

వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంపై జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఘాటుగా స్పందించింది. వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేసే అంశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యవహరిస్తున్న తీరుపై అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా సీరియస్ అయింది. రేషన్‌ కార్డులు జారీ చేయాలని వలస కార్మికులు.. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత కూడా వారికి కార్డులు జారీ చేయడంలో ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీటిపై రాష్ట్రాల తీరు ఆందోళనకరమని.. ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది.


ఒక రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయడంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నట్లు పేర్కొంది. ఇక ఓపిక నశించిందని.. తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇదే చివరి అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లేని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ వ్యవహారంపై నవంబరు 19వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులకు ఎదురైన సమస్యలు, ఇబ్బందులు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలనే అంశంపై 2020లోనే సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా.. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో అప్లై చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని 2021లోనే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే వలస కార్మికులకు రేషన్ కార్డులను జారీ చేయగా.. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆలస్యం చేయడం పట్ల సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com