ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. దర్శనాల విషయంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:34 PM

మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు శబరిమల అయ్యప్ప దర్శనం విషయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనం కోసం ఈసారి ఆన్‌లైన్ బుకింగ్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్‌లైన్ ద్వారా దర్శనానికి బుకింగ్ చేసుకోవాలని.. ఓ ప్రకటనతో తెలిపింది. ఇదే సమయంలో రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులను మాత్రమే స్వామి దర్శనానికి అనుమతిస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.


అయితే మకరవిళక్కు సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేరళ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అయ్యప్ప భక్తులకు కాస్త ఇబ్బందేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో అయ్యప్ప దర్శనం కోసం అయ్యప్ప భక్తులు భారీగా శబరికొండకు వస్తుంటారు. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా ముందే అనుమతి తీసుకోవాలనడం.. అందులోనూ రోజుకు 80 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పటంతో కాస్త ఇబ్బంది తప్పదు. అయితే భక్తుల రద్దీ కారణంగా ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే కేరళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో ఎంచుకోవచ్చని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.


మరోవైపు మండలం మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే వర్చువల్ క్యూ బుకింగ్‌లు రోజుకు 80 వేలకు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అటవీ మార్గంలో సౌకర్యాల కల్పన, రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకల నిర్వహణ, భక్తులు వచ్చే మార్గంలో కౌంటర్ల ఏర్పాటు, అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధిపై చర్చించారు. అలాగే యాత్రికుల కోసం నీలక్కల్, ఎరుమేలీ బేస్ స్టేషన్ల వద్ద అదనపు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రహదారుల మరమ్మత్తులు, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణను సీజన్ ప్రారంభం కాకముందే పూర్తిచేయాలని సీఎం పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు.


ఇక శబరిమలలో పరిశుభ్రత, పారిశుధ్యం పనులు నిర్వహించే విశుద్ధి సేన సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కేరళ సీఎం ఆదేశించారు. సన్నిధానంలోని శబరి గెస్ట్ హౌస్ మరమ్మత్తు పనులు వేగంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. మరోవైపు గత సీజన్ సమయంలో సుమారుగా 50 లక్షల మంది భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఇక భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్ అంతరాయాలు కలిగాయి. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవటంలో కేరళ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేరళ సర్కారు.. రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతించాలని.. దర్శినం కోసం ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com