తిరుమల లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. శ్రీవారి లడ్డూ అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన ముఖ్యమైన అంశమని అనిత అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని చెప్పుకొచ్చారు. సిట్ ఏర్పాటుతో స్వామివారి భక్తులు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆమె అన్నారు. తప్పు చేయనివారు భయపడరని, విజిలెన్స్ ఎంక్వైరీ అంటే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్ ద్వారా త్వరలో నిజానిజాలు బయటపడతాయని, స్వామివారికి అపచారం చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమని హోంమంత్రి అనిత అన్నారు.